కోహ్లీ సెంచరీ వృథా... సిక్స్ తో సెంచరీ పూర్తిచేసుకున్న బట్లర్... ఎదురులేని రాజస్థాన్

ఐపీఎల్ తాజా సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో నెగ్గిన రాజస్థాన్ రాయల్స్ టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 183 పరుగులు చేసింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (113 నాటౌట్) సెంచరీ సాధించాడు. అయితే, లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు  చేసి విజయభేరి మోగించింది. 

రాజస్థాన్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ జోస్ బట్లర్ అద్భుత సెంచరీతో మెరిశాడు. బట్లర్ కేవలం 58 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బట్లర్ చివరలో ఓ సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. బట్లర్ 94 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా... రాజస్థాన్ స్కోరు 183 పరుగులు. ఇంకొక్క పరుగు చేస్తే రాజస్థాన్ గెలుస్తుందనగా, బెంగళూరు బౌలర్ కామెరాన్ గ్రీన్ విసిరిన బంతిని బట్లర్ సిక్స్ గా మలిచాడు. ఐపీఎల్ లో బట్లర్ కు ఇది 100వ మ్యాచ్ కాగా, సెంచరీతో చిరస్మరణీయం చేసుకున్నాడు. 

అంతకుముందు, బట్లర్ కు కెప్టెన్ సంజూ శాంసన్ నుంచి చక్కని సహకారం లభించింది. సంజూ శాంసన్ 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 69 పరుగులు చేశాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వైఫల్యాల పరంపర ఈ మ్యాచ్ లోనూ కొనసాగింది. ఇవాళ రెండు బంతులాడిన జైస్వాల్ (0) డకౌట్ అయ్యాడు. 

రియాన్ పరాగ్ (4), ధ్రువ్ జురెల్ (2) నిరాశపరిచారు. హెట్మెయర్ 6 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో రీస్ టాప్లే 2, యశ్ దయాళ్ 1, సిరాజ్ 1 వికెట్ తీశారు.

Jos Butler
Rajasthan Royals
Royal Challengers Bengaluru
Jaipur
IPL 2024

More Telugu News